నేడు మీడియా ముందుకు మోడీ
ప్రెస్మీట్లు.. ప్రెస్ కాన్ఫరెన్సులకు దూరంగా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ మీడియా ప్రతినిధులతో ముచ్చటించే అవకాశం ఉందని పార్లమెంట్ సెక్రటరీ పేర్కొన్నారు. సాధారణంగా బహిరంగ సభలు, పలు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ మాట్లాడడం తరచూ జరుగుతుంటుంది. కానీ, నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు మీడియాతో చాలా సందర్భాల్లో మాట్లాడని ప్రధాని మోడీ.. బుధవారం ఏం మాట్లాడనున్నారు.. మాట్లాడితే ఎలాంటి అంశాల గురించి ప్రస్తావించనున్నారు..? మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి..? ఎలాంటి జవాబిస్తారు.? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
హైదరాబాద్లో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్
హైదరాబాద్లో మరో భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. అంతర్జాతీయ ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు. మనదేశంలోని వివిధ నగరాలకు చెందిన మహిళలు, యువతులతోపాటు విదేశాలకు చెందినవారు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. మహిళలు, యువతులకు నిర్వాహకులు ఎండీఎంఏ డ్రగ్స్ అలవాటు చేయడంతోపాటు బాధిత మహిళల ద్వారా విటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ మత్తు దందా నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన అర్నవ్ ఈ ముఠాకు నాయకుడిగా ఉంటూ దందా కొనసాగిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ ముఠా ఉచ్చులో ఏకంగా 14,190 మంది మహిళలు చిక్కుకున్నారని తెలిపారు.
కవిత విత్ సీబీఐ.. డేట్ ఫిక్స్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెయిల్కు సీబీఐ అధికారులు స్పందించారు. డిసెంబర్ 11న విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకరించింది. డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని సీబీఐ అధికారులు బదులిచ్చారు. దీనికి కవిత కూడా అంగీకరించారు. విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
రాజాసింగ్కు మళ్లీ నోటీసులు:
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. మంగళవారం ట్విట్టర్లో రాజాసింగ్ పెట్టిన పోస్ట్ జనాలను రెచ్చగొట్టేలా ఉందని పోలీసులు పేర్కొన్నారు. రెచ్చ గొట్టే ప్రసంగాలు, సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయవద్దన్న హై కోర్టు ఆర్డర్ను ఉల్లంఘించినందుకు ఈ నోటీసులు ఇస్తున్నట్టు తెలిపారు.
హయత్నగర్ వరకూ మెట్రో
భాగ్యనగరంలో మెట్రో సేవలకు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బిజీ రూట్గా పేరున్న ఎల్బీ నగర్ మార్గంలో హయత్ నగర్ వరకు మెట్రో పొడగింపు ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు, నాగోల్-ఎల్బీ నగర్ మెట్రో లైన్ను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేసి తీరతామన్నారు.
6 వేల సార్లు సైబర్ దాడి.. అయినా ఫెయిలే:
దేశంలోని పెద్ద ఆస్పత్రుల్లో రోగుల వివరాలు లక్ష్యంగా హ్యాకర్లు సైబర్ దాడులు చేస్తున్నారు. గతవారం దిల్లీ ఎయిమ్స్, తమిళనాడులోని ఓ ఆస్పత్రి డేటాబేస్పై హ్యాకర్స్ సైబర్దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు నవంబరు 30న భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సర్వర్ను హ్యాక్ చేసేందుకు సుమారు 6 వేలసార్లు ప్రయత్నించారట. అయితే, వారు ఐసీఎమ్ఆర్ సర్వర్ను హ్యాక్ చేయలేకపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలు, కార్యాలయాల్లోని డేటాబేస్పై హ్యాక్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
మళ్లీ ఇండియన్ రేసింగ్ లీగ్
హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో ఈ నెల 10, 11వ తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 9న ఉదయం 11 గంటల నుంచి 11వ తేదీన లీగ్ ముగిసే వరకు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్ను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియన్ రేసింగ్ లీగ్.. నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్, కొత్త సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కంపౌండ్, ఐమ్యాక్స్ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ థియేటర్ల వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. అవసరమైతే 7, 8 తేదీల్లోను ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని పేర్కొన్నారు.
1147 పోస్టులకు నోటిఫికేషన్:
వైద్యారోగ్యశాఖ లో 1,147 మంది డాక్టర్లను నియమించనున్నారు. డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రోఫెసర్ల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఈ నెల 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లను తీసుకోనున్నారు. పూర్తి వివరాలకు
కోస్తాకు మాండస్ తుఫాన్ ముప్పు:
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధవారం నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 8న తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఈ తుఫాన్కు వాతావరణశాఖ మాండస్ అని పేరు పెట్టారు.ఈ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగా.. ఉత్తర కోస్తాలో స్వల్పంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు.. దక్షిణ కోస్తాలో రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెబుతున్నారు.
6,200 కోట్లు పెట్టుబడి పెట్టనున్న క్యాపిటల్యాండ్:
తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కాపిటలాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి సుమారు 6,200 కోట్ల రూపాయలతో తన పెట్టుబడి ప్రణాళికలను ఈరోజు ప్రకటించింది. ఈ 6,200 కోట్ల రూపాయల పెట్టుబడిలో…. ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్తో మంగళవారం క్యాపిటల్యాండ్ ఒప్పందం కుదుర్చుకుంది.