ఖమ్మం సభకు నలుగురు సీఎంలు.. భారీ ఏర్పాట్లు
ఖమ్మంలో జరగబోయే బీఆర్ఎస్ అవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ హైదరాబాద్కు చేరుకున్నారు. సీపీఐ జాతీయ నాయకులు డి రాజా కూడా హైదరాబాద్ వచ్చారు. ఎయిర్పోర్టులో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ ఆలీ వారికి ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా నాయకులు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా హైదరాబాద్కు రానున్నారు. బుధవారం ఉదయం వీరందరూ యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహుడిని దర్శించుకొని ఖమ్మం బయల్దేరుతారు. ఖమ్మంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. బీఆర్ఎస్ తొలి రాజకీయ సభ కావటంతో ఈ సభకు మూడు లక్షల మందిని తరలించాలని మంత్రులు, లీడర్లు టార్గెట్గా పెట్టుకున్నారు.
నిజాం నవాబ్కు కేసీఆర్ నివాళులు
8వ నిజాం ముకరం ఝా పార్థీవ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబీకులను ఓదార్చారు. టర్కీలో కన్నుమూసిన 8వ నిజాం ముకరం ఝా భౌతికకాయం హైదరాబాద్ చేరుకుంది. చార్టెడ్ ఫ్లైట్ లో రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న భౌతికకాయాన్ని అక్కడి నుంచి చౌమహల్లా ప్యాలెస్ కు తరలించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల సందర్శనార్థం ప్యాలెస్ లోకి జనాన్ని అనుమతిస్తారు. సాయంత్రం 4 గంటలకు భౌతికకాయాన్ని చౌమహల్లా ప్యాలెస్ నుంచి మక్కా మసీదుకు తీసుకెళ్లనున్నారు. అక్కడ ప్రార్థనలు నిర్వహించిన అనంతరం సంప్రదాయ పద్దతిలో.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నడ్డాయే మళ్లీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను మరోసారి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. మరో ఏడాదిన్నర కాలం.. 2024 లోక్సభ ఎన్నికల వరకు ఆయనను అదే పదవిలో కొనసాగించాలని పార్టీ జాతీయ కార్యవర్గం చేసిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. 2020 జనవరిలో అధ్యక్షుడిగా ఎన్నికైన నడ్డా పదవీకాలం ఈ నెల 20తో ముగియనుంది. మంగళవారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షుని కొనసాగింపుపై కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీడియాకు వెల్లడించారు. తనను అధ్యక్షునిగా ఎంపిక చేయటంపై నడ్డా మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. మోదీ మూడోసారి కూడా ప్రధానిగా ఎన్నికై దేశానికి నాయకత్వం వహిస్తారని అన్నారు.
20న రాష్ట్రానికి మాణిక్రావ్ ఠాక్రే
కాంగ్రెస్ చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి పార్టీ లీడర్లను సమాయత్తపరిచేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఇంచార్జి కార్యదర్శులతో సమావేశమవుతారు. అనంతరం ఏఐసీసీ కార్యక్రమాల అమలుపై వివిధ కమిటీలతో ఆయన గాంధీభవన్లో విడివిడిగా భేటీ కానున్నారు. ఈ నెల 26 నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం జరుగనుంది.
23 నుంచి టీచర్ల బదిలీలు..!
ఈ నెల 23 నుంచి టీచర్ల బదిలీల షెడ్యూలు మొదలవనుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ల ప్రక్రియను ఆమె సమీక్షించారు. జవాబుదారీతనంతో, లోపాలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పదోన్నతులు, బదిలీల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు.
బాలికపై గ్యాంగ్ రేప్
నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో గ్యాంగ్ రేప్ జరిగింది. బాలిక తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలిక సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ ఊరికి వెళ్లింది. అదే ఊళ్ల రౌడీబాయ్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ షాప్ నడుపుతున్న యువకులు దిలీప్, శివ, నరేశ్ బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్కు బయల్దేరిన బాలిక అంగడిపేట క్రాస్రోడ్డుకు ఆటోలో వెళ్లి బస్సు ఎక్కాల్సి ఉండటంతో అమ్మమ్మతో కలిసి ఆ బాలిక ఆటో కోసం ఎదురుచూస్తోంది. శివ, నరేశ్ కారులో అటువైపు వెళుతుండటంతో. బాలికను అంగడిపేట క్రాస్రోడ్డు వద్ద దించాలని అమ్మమ్మ వారిని కోరింది. బాలికను కారు ఎక్కించుకున్న యువకులు తమ షాపుకు తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావానికి గురైన బాలికను యువకులు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ బాలిక చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నేడే ఉప్పల్లో ఇండియా న్యూజిలాండ్ వన్డే
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఇండియా న్యూజిలాండ్ టీమ్లు ఈ రోజు తలపడనున్నాయి. తొలి మ్యాచ్లో వరల్డ్ నంబర్ వన్ టీమ్ న్యూజిలాండ్తో టీమిండియా పోటీ పడుతుండటంతో అభిమానుల రద్దీ పెరిగింది. హైదరాబాద్లో నాలుగేండ్ల గ్యాప్ తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1.30కి మ్యాచ్ మొదలవుతుంది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో అదరగొట్టిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్కు హోమ్గ్రౌండ్లో ఇదే తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. లోకల్ స్టార్ సిరాజ్తోపాటు ఇండియా కూడా అదే జోరు చూపెట్టి కివీస్ను పడగొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.