బండి సంజయ్​ సక్సెస్​ వెనుక ఏముంది

బండి సంజయ్.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. జాతీయ పార్టీ బీజేపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ లీడర్లున్నా… బీజేపీ సంజయ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన మాటలు,, యాక్టివిటీతో రాష్ట్రంలో యూత్ను అట్రాక్ట్ చేయటంలో సంజయ్ నెంబర్ వన్ పొజిషన్కు చేరుకున్నాడనే చెప్పుకోవాలి. ఇంతకీ సంజయ్ పొలిటికల్ మైలేజీ సాదాసీదాగా మొదలైంది. కరీంనగర్ లో మున్సిపల్ కార్పొరేటన్ నుంచి ఎంపీ వరకు ఎదిగిన సంజయ్.. నిజంగా సామాన్యుడు.. ఇప్పుడు రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న పొలిటికల్ లీడర్.

బండి సంజయ్‌ కుమార్‌ది సామాన్య మధ్య తరగతి కుటుంబం. ఆయన తండ్రి బండి నర్సయ్య ప్రభుత్వ టీచర్‌గా పనిచేసేవారు. అయితే.. ఎక్కువ కాలం డిప్యుటేషన్‌ మీద జిల్లా పరిషత్‌లో విధులు నిర్వహించారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవారు. ప్రమాదవశాత్తూ ఆయన మరణించారు. అమ్మ శకుంతల గృహిణి. బండి సంజయ్ తల్లిదండ్రులకు నలుగురు సంతానం. ఇద్దరు అన్నలు, ఒక అక్క తర్వాత ఇంట్లో అందరికంటే చిన్నవాడు ఆయనే. బండి సంజయ్ కుటుంబం కరీంనగర్‌ లో నివాసముంటుంది. సంజయ్ భార్య అపర్ణ ఎస్‌బీఐ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.

సంజయ్​ తండ్రి నర్సయ్యకు ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్న వ్యక్తి. అది బండికి వారసత్వంగానే కలిసి వచ్చింది. ఏబీవీపీ విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయన దగ్గరికి వచ్చి కాలేజీ సమస్యలు చెపుతుండేవారు.. ఆ సమయంలో వాళ్ల తండ్రి గమనించేది. ఏబీవీపీ నాయకుడిగా గొడవల్లో పాల్గొన్నప్పుడు పోలీసులు ఇంటికి వచ్చి బండిని తీసుకెళ్లినా.. ఆయన అడ్డు చెప్పేవారు కాదు.

బండి సంజయ్ తల్లిదండ్రులు కరీంనగర్ కాపువాడలో ఉన్నప్పుడు ఆయణ్ని ఒకటో తరగతిలో సరస్వతి శిశుమందిర్‌లో చేర్పించారు. శిశుమందిర్‌ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఏర్పడింది. రోజూ శాఖకు వెళ్లేవారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఘటన్‌ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశారు. సరస్వతి శిశుమందిర్‌ ద్వారా తనకు విద్యతో పాటు క్రమశిక్షణ అలవడిందని ఆయన చెబుతారు. తనకు నాయకత్వ లక్షణాలను ఆర్‌ఎస్‌ఎస్‌ నేర్పిందని.. ఇప్పటికీ స్వయక్‌ సేవక్‌ని అని చెప్పుకోవడానికి ఆయన గర్వపడతారు. ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్‌ను ఢిల్లీ సెంట్రల్‌ ఆఫీస్‌లో సహాయక్‌గా పంపించారు. ఇది మరో మలుపు తిప్పింది. సెంట్రల్‌ ఆఫీసులో ఉండి అద్వానీకి, వెంకయ్యనాయుడుకు సేవలందించారు. ఈ సమయంలోనే వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు. హిందూ ధర్మాన్ని అనుసరించే బండి సంజయ్‌కి.. చిన్ననాటి నుంచే తన నుదిటిపై కుంకుమ బొట్టును ధరించడం అలవాటు. అలా బొట్టు పెట్టుకోవడం వల్ల కొన్ని విద్యా సంస్థల్లో అనుమతి నిరాకరించారు కూడా. అయినా ఏనాడు తన పద్దతిని మార్చుకోలేదు.

1996లో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సురాజ్‌ రథయాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను చుట్టివచ్చిన ఆయన.. కరీంనగర్‌ యాత్రకు వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వేకువజామునే చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మెట్‌పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు చూసి చలించిపోయారు. మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానీకి గంట గంటకు టీ ఇప్పించే పని అప్పగించారు. తర్వాత వెంకయ్యనాయుడు ద్వారా సిఫార్సు చేసి ఆయణ్ని అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్‌చార్జిగా నియమించారు. ఇది బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పింది. దీనికి తోడు కరీంనగర్ నుంచి అయోధ్యకర సేవకు వెళ్లిన మొదటి బ్యాచ్ లో బండి ఒకరున్నారు. ఇంట్లో కూడా చెప్పకుండానే ఆయోధ్యకు వెళ్లి రావడం విశేషం.

1994లో 23 ఏళ్ల వయసులోనే బండి సంజయ్.. కరీంనగర్‌ అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఇదే బండి సంజయ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం. మరోసారి కూడ 2000 సంవత్సరంలో బ్యాంకు డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. 2005లో బీజేపీ నుంచి తొలిసారిగా కౌన్సిలర్‌గా గెలిచారు. 2010లో 48వ డివిజన్‌కు మరోసారి కార్పొరేటర్‌గా భారీ మెజారిటీతో గెలిచారు. 2014, 2018లలో కరీంనగర్‌ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి.. టీఆర్‌ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్‌పై గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరికంటే ఎక్కువ మెజారిటీతో ఆయన గెలుపొందడం విశేషం. ఇదే ఊపులో జాతీయ పార్టీకి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. చిన్నతనంలోనే సామాన్య కుటుంబం నుంచి ఎటువంటి పొలిటికల్ సపోర్టు లేకుండానే ఈ స్థాయికి చేరుకున్నారు బండి సంజయ్.

అధ్యక్షునిగా ఎన్నికైన తరవాత రాష్ట్రంలో బీజేపీకి ఒక కొత్త ఊపు తెచ్చారు. అవసరమున్న సమయంలో గాంధేయ మార్గంలో దీక్షలు చేపడుతూ.. మరోవైపు దూకుడుగా వ్యవహారిస్తూ అధికార పార్టీ చుక్కలు చూపిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రేటర్ ఎన్నికల్లో ఒంటి చేత్తో గతంలో రానటువంటి ఎక్కువ సీట్లు తెచ్చేలా చేశారు. ఆ తరవాత దుబ్బాక, హజురాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం తనదైన శైలిలో ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారిపోయాడు. గతంలోనూ కరీంనగర్ లో జరిగిన పలు ఘటనల్లో జైలుకు వెళ్లి వచ్చారు. తాజాగా ఉద్యోగుల కోసం చేపట్టిన జాగరణ దీక్షను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చెదరగొట్టి బలవంతంగా లాక్కెల్లి కేసులు పెట్టారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జ్యూడిషయల్ రిమాండు చేశారు. దీంతో ఒక్కసారిగా బండి సంజయ్ కు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో మరోసారి చర్చలోకి వచ్చారు. కామన్ మ్యాన్గా తన ప్రస్థానం మొదలు పెట్టిన సంజయ్.. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్కు సింహస్వప్నంలా మారిపోయారు.

చిన్ననాటి నుంచి స్వయం సేవక్‌ లో అలవాటైన క్రమశిక్షణ.. హిందూ ధర్మంపై విశ్వాసం.. విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర.. కరీంనగర్ అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా, మున్సిపల్ కార్పొరేటర్‌గా అందించిన సేవలు.. అందరితో వ్యక్తిగతంగా కలుపుగోలుగా ఉండటం..సంజయ్ ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. సంజయ్​కు ముగ్గురు అన్నదమ్ములు. ఒక అక్క ఉంది. ఇప్పటికీ ముగ్గురు అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంగా కలిసిమెలిసి ఉంటున్నారు. కష్టసుఖాలను కలిసి పంచుకుంటారు. చాలా సందర్భాల్లో బండి సంజయ్ .. ఈ ఉమ్మడి కుటుంబమే తనకు ప్రత్యేక బలం అని చెప్పుకుంటారు కూడా.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here