మధుమేహం ఉన్నవారు కొలెస్ట్రాల్, కొవ్వు, చక్కెర కలిగి ఉన్న అన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు పండ్లు, కూరగాయల్లోనూ ఎంపిక చేసిన వాటినే తినాలి. తక్కువ కొవ్వు, అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
డయాబెటిక్స్ ఉన్నవారు ముఖ్యంగా తీపి పదార్ఖాలకు దూరంగా ఉండాలన్న విషయం తెలిసిందే. జ్యూస్ లాంటివి ఎంత దూరం పెడితే అంత మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే పండ్ల రసాలను ఎంత నివారిస్తే అంత ఆరోగ్యం. ఎందుకంటే ఇందులో సాధారణంగానే చక్కెరలు ఉన్నందుకు వీటిని తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవే కాదు ప్యాక్ చేసిన రసాలు కూడా తీసుకోకూడదని చెబుతున్నారు. అలా ప్యాక్ చేయడం వల్ల విటమిన్లు కోల్పోతాయని, వాటిలో ఫైబర్ ఉండదని వివరిస్తున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను త్రాగడానికి బదులు నేరుగా తింటే మంచిది. దీని వల్ల శరీరానికి అందాల్సిన స్థాయిలో ఫైబర్ కూడా అందుతుంది. ఒకవేళ ఈ తరహా రసాలు తీసుకోవాల్సి వస్తే.. చక్కెర, తేనె లాంటివి జోడించకూడదు.
మధుమేహం ఉన్నవారు పండ్లను తినాలనుకుంటే నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే వాటిలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్, యాంటీ-వైరస్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
డయాబెటిస్ ఉన్నవారికి నారింజ రసం తాగాలని అనిపిస్తే.. ఎప్పుడో ఒకసారి తగినంత మోతాదులో తీసుకోవాలి. కానీ ఎక్కువ తాగవద్దని నిపుణులు చెబుతున్నారు. చక్కెర, తేనె లాంటివి జోడించకుండా రోజుకు గరిష్టంగా 1-2 కప్పులు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇది కూడా వైద్యుల సలహాతోనే పాటించాలని చెబుతున్నారు.