సీఎస్ సోమేశ్ కు షాక్.. ఏపీకి వెళ్లాలని ఆదేశాలు
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఆదేశించింది. తెలంగాణకు సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసిన ధర్మాసనం.. సర్టిఫైడ్ కాపీ అందిన వెంటనే ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ కేడర్ నుంచి తప్పించిన కేంద్రం ఆయనను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని సోమేశ్ కుమార్ను ఆదేశించింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులపై ఆయన క్యాట్ను ఆశ్రయించడంతో 2016లో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేలా హైదరాబాద్ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులతో అప్పటి నుంచి సోమేశ్ తెలంగాణలోనే కొనసాగుతున్నారు. సోమేశ్ కుమార్ విషయంలో క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని కేంద్రం 2017లో హైకోర్ట్ కు వెళ్లింది. ఇవాళ క్యాట్ ఉత్తర్వులను కొట్టేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ నందాతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది.
ఖమ్మం నడిబొడ్డున పార్టీ మారుతా!
తాను పార్టీ మారాల్సి వస్తే ఖమ్మం నడిబొడ్డున లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో కండువా కప్పుకుంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లో పర్యటించి ఇటీవల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను, అనారోగ్యానికి గురైన వారిని పరామర్శించారు. అన్నపురెడ్డిపల్లిలో కార్యకర్తలు ‘సార్ మీరు పార్టీ మారుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నయ్’ అని అనగానే పై విధంగా స్పందించారు. ‘నేను పార్టీ మారితే నాతో పాటు నా కార్యకర్తలంతా కండువాలు కప్పుకునేలా చేస్తా’ అని అన్నారు.
సంజయ్ నువ్వు మళ్లా గెలిచేదిలేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ అభివృద్ధికి ఆయన ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. గుజరాత్ లీడర్లు వస్తే చెప్పులు నెత్తిమీద పెట్టుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదని అన్నారు. ఈసారి కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గెలవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు దీనిని ఛాలెంజ్గా తీసుకుని పనిచేయాలన్నారు. ప్రస్తుతం బీజేపీకి కనిపిస్తున్నది ట్రైలర్ మాత్రమేనని 2023లో అసలు సినిమా చూపిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.
గోల్డెన్ టెంపుల్లోకి రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పంజాబ్లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన అమృత్సర్ లోని గోల్డన్ టెంపుల్ ను దర్శించుకున్నారు. కాషాయ రంగు తలపాగా ధరించిన రాహుల్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహుల్ మూడెంచల భద్రత ఉన్నప్పటికీ భద్రతా సిబ్బంది ఎవరూ కూడా టెంపుల్ లోపలికి రాలేదు. రాహుల్ కూడా టెంపుల్ లోపల కూడా సామాన్య వ్యక్తిలానే ఉన్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి గోల్డన్ టెంపుల్లోకి రావడం ఇదే తొలిసారి.
ఆస్కార్ రేసులో కాంతారా
గత ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘కాంతార’ సినిమా ఓ సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఊహించని రీతిలో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. రిషబ్శెట్టి నటించిన ‘కాంతార’ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించినట్లు హోంబలే ఫిల్మ్స్ తెలిపింది.
గిన్నిస్ బుక్లోకి ఎలాన్ మస్క్
టెస్లా, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఎలాన్ మస్క్ అత్యధిక సంపదలోనే కాదు..అతిపెద్ద నష్టంలోనూ రికార్డు సృష్టించి గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. అనతికాలంలో ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఎదిగిన ఎలాన్ మస్క్ ..అంతేవేగంగా తన సంపద కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల మస్క్ వ్యక్తిగత ఆస్తులు భారీగా క్షీణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో చరిత్రలో అత్యంత సంపదను కోల్పోయిన వ్యక్తిగా రికార్డు సృష్టించినట్లు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. ఒక్క ఏడాది వ్యవధిలోనే (2021-2022) దాదాపు 182 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైందని అంచనా.
సిద్ధిపేట్ లో కాల్వలో పడ్డ కారు.. ఆరుగురు మృతి
భువనగిరి యాదాద్రి జిల్లా బొమ్మల రామారం బీబీనగర్ గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి.. తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో దైవ దర్శనం కోసం వేములవాడకు వెళ్లారు. దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుండగా..సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప గ్రామం వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న కెనాల్ లో కారు పడిపోయింది. కారు అదుపు తప్పడంతోనే కెనాల్ లో పడిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న సమ్మయ్యతో పాటు ఆయన భార్య స్రవంతి, పిల్లలు భవ్యశ్రీ, లోకేష్, అత్త రాజమణి ప్రమాద స్థలంలోనే చనిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సమ్మయ్య మామ వెంకటేష్ ను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెంకటేష్ ను తీసుకెళ్లారు. అప్పటికే వెంకటేష్ పరిస్థితి విషమించి.. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు.
ఈ నెల 28న హైదరాబాద్కు అమిత్షా:
సంక్రాంతి తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. ఈనెల 28న రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా అమిత్ షా పర్యటన ఉండనుంది. వివిధ స్థాయిలో పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సంఘ్ నేతలతో కూడా అమిత్ షా సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అంతకంటే ముందుగానే రాష్ట్రంలో కేసీఆర్, మోడీ బహిరంగ సభలు జరగనున్నాయి.
పొద్దుగాల నాలుగింటి నుంచే సినిమా షోలు
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు సినిమాలకు ఆరో ఆటకు అనుమతి ఇచ్చింది. సినిమాల రిలీజ్ రోజున ఉదయం 4 గంటల నుంచి షో వేసుకోవచ్చునని పేర్కొంది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అభ్యర్థనపై స్పందించిన సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
టీమిండియా విక్టరీ
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి పరాజయం పాలైంది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. టీమిండియా బ్యాటర్లలో కోహ్లి సెంచరీ చేయగా, రోహిత్, గిల్ అర్ద సెంచరీలు చేశారు.