అమెరికాలో విమానాలు బంద్
అమెరికాలో బుధవారం విమాన సర్వీసులు ఆగిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్స్) సిస్టమ్ లో టెక్నికల్ లోపం కారణంగా విమానాలు ఎయిర్ పోర్టులకే పరిమితమయ్యాయి. అమెరికా నుంచి రాకపోకలు సాగించే దాదాపు 1,200 ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి, మరో 100 ఫ్లైట్లను రద్దు చేశారు. నోటమ్ సిస్టమ్ ద్వారా ఏవైనా ప్రమాదాలు, వాతావరణ సమస్యలు, రూట్లలో మార్పుచేర్పుల గురించి ఎప్పటికప్పుడు పైలట్లను ఎఫ్ఏఏ అలర్ట్ చేస్తుంది.
సీఎస్గా శాంతి కుమారి
రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా శాంతికుమారి నియమితులయ్యారు. 1989 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె.. ఇన్నాళ్లూ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సీఎస్గా శాంతికుమారి పేరును ఖరారుచేస్తూ ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ వెంటనే బీఆర్కే భవన్లో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. 2025 వరకు ఆమె సర్వీస్లో ఉంటారు. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా ఎంపికైన తొలి మహిళ కూడా ఆమెనే.
నేడు ఏపీకి సోమేశ్కుమార్
సీనియర్ ఐఏఎస్, స్పెషల్ సీఎస్ సోమేష్ కుమార్ గురువారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఏపీ సచివాలయానికి వెళ్లి అక్కడి సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఆ తరువాత ఆయన లాంగ్ లీవ్ తీసుకోవడం లేదా సీఎం కేసీఆర్ నుంచి ఏదైనా హామీ వస్తే వీఆర్ఎస్కు అప్లై చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్
గ్రూప్ వన్ పోస్టుల ఫలితాల వెల్లడికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఒకే ఒక్క అభ్యర్థి లేవనెత్తిన న్యాయపరమైన అంశం ఆధారంగా మొత్తం పోస్టుల ఫలితాలను వెల్లడించకుండా ఉంచడం సరికాదని చెప్పింది. ఒక అభ్యర్థి స్థానికత వివాదాన్ని తాము తర్వాత తేల్చుతామని స్పష్టం చేసింది. ఈలోగా సింగిల్ జడ్జి ఆర్డర్ కారణంగా నిలిచిపోయిన గ్రూప్–1 ఫలితాలను విడుదల చేయవచ్చునని టీఎస్పీఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్కు కాంగ్రెస్ కొత్త బాస్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి బుధవారం హైదరాబాద్కు వచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా గాంధీభవన్ చేరుకున్నారు. ముందుగా ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావిద్తో భేటీ అయ్యారు. తర్వాత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో విడివిడిగా సమావేశమయ్యారు. సుమారు 30 నుంచి 40 నిముషాల వరకు ఒక్కొక్కరికి ఆయన సమయం ఇచ్చారు. వీళ్లతో భేటీ ముగిసిన తర్వాత సీనియర్ నేతలతో వ్యక్తిగతంగా మాట్లాడారు.
నాటు నాటుకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్
అంతర్జాతీయ వేదికపై ‘నాటు నాటు’ పాట చిందేసింది. ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును ముద్దాడింది. సినీ గేయ రచయిత చంద్రబోస్ రాసిన ఈ పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో పురస్కారాన్ని అందుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. బుధవారం క్యాలిఫోర్నియాలో జరిగిన వేడుకలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అవార్డును అందుకున్నారు.
సంక్రాంతికే వందే భారత్ రైలు షురూ
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ టూర్ వాయిదా పడింది. ఈ నెల 19న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్–విజయవాడ మధ్య వందే భారత్ రైలును మోడీ ప్రారంభించి, తర్వాత పెరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే, మోడీ తెలంగాణ టూర్ తాత్కాలికంగా వాయిదా పడిందని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి నాడే వందేభారత్ రైలును వర్చువల్గా ప్రారంభిస్తారని చెప్పారు.
వెంకట్నారాయణ్ రెడ్డికి బీజేపీ టికెట్
మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సెగ్మెంట్ లో బీజేపీ తరఫున టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏ.వెంకటనారాయణ్ రెడ్డి (ఏవీఎన్ రెడ్డి) పేరు ఖరారైంది. మార్చ్ లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏవీఎన్రెడ్డితో పాటు మురళీమనోహర్ పేర్లను కేంద్రానికి పంపగా..ఏవీఎన్రెడ్డి పేరును ఢిల్లీ నేతలు ఖరారు చేశారు. హైదరాబాద్ కి చెందిన ఏవీఎన్రెడ్డి.. ప్రస్తుతం దిల్ సుఖ్ నగర్పబ్లిక్ స్కూల్, ఏవీఎన్ఇంజినీరింగ్ కాలేజీ, ఏవీఎన్ఇంటర్నేషన్ స్కూల్ తదితర విద్యాసంస్థలకు చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇదే సెగ్మెంట్ లో ఆయన 2007, 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఫస్ట్ ప్రయార్టీ ఓట్లలో రెండోస్థానంలో నిలిచారు.
శవాల కెమికల్తో పాల తయారీ
యాదాద్రి జిల్లాలో ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు నిర్వహించిన తనిఖీల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. శవాలను భద్రపరచానికి ఉపయోగించే కెమికల్ పాలల్లో కలుపుతున్నట్టు తేలింది. దీంతో సదరు పాల వ్యాపారీని అరెస్ట్ చేసి, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీబీనగర్ మండలం కొండమడుగులో ప్రైవేట్ పాల సేకరణ సెంటర్ను ఆఫీసర్లు బుధవారం పరిశీలించారు. అక్కడి పాలను టెస్ట్ చేయగా శవాలను భద్రపరచడానికి వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్ను ఉపయోగిస్తున్నారని తేలింది. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉన్న అవి పగిలిపోకుండా ఉండడానికి ఫార్మల్ డిహైడ్ కెమికల్ను వినియోగిస్తున్నారు. రైతుల నుంచి పాలు సేకరించి, వాటిలో నీళ్లు, సుక్రోస్, అమ్మోనియం సల్ఫేట్, ఫార్మాల్డిహైడ్ కలిపి కల్తీ చేస్తున్నట్టు గుర్తించారు. వీటిని ప్యాకెట్స్గా చేసి స్థానికంగా విక్రయించడంతో పాటు హైదరాబాద్లోని హోటల్స్కు తరలిస్తున్నారు.