ఏఈ పరీక్ష రద్దుపై నేడు నిర్ణయం..
లీకైన ఏఈ (AE) పరీక్షపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి మంగళవారం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక నివేదిక వచ్చిన తర్వాతే పరీక్ష రద్దుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రద్దు చేయడమా ఇంకేదైనా చేయడమా అనే దానిపై లీగల్ ఓపినియన్ తీసుకుంటామన్నారు. టీఎస్పీఎస్సీ ఇటీవల కాలంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన పేపర్లు కూడా లీక్ అయ్యాయా? అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే తేలుతుంది. దానికి అనుగుణంగానే వాటిపై నిర్ణయం ఉంటుంది. ఒక్కదాంతో అన్నింటికీ ముడిపెట్టలేము. ఎవిడెన్స్ బేస్డ్ ఫ్యాక్ట్ ఆధారంగానే ముందుకు వెళ్తామన్నారు.
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1:
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని టీఎస్పీఎస్సీ చైర్మన్ నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. పేపర్ లీక్ కు కారణమైన ప్రవీణ్కు గ్రూప్-1 ప్రిలిమ్స్లో 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అతను క్వాలిఫై కానీ మాట కూడా నిజమేనన్నారు. ప్రవీణ్ లీవ్ పెట్టకుండా.. ఎగ్జామ్ రాయడంపై జనార్ధన్ రెడ్డి స్పందించారు. పరీక్ష రాసే అభ్యర్థి లీవ్ పెట్టడం అనేది రూల్ కాదన్నారు. అది ఎథికల్ ఇష్యూ అన్నారు. ఎగ్జామ్ రాసేటోళ్లందరూ లీవ్ పెట్టరా లేదా అనేది అంతా చూడమన్నారు. అయినా గ్రూప్ 1 జాబ్ అంతా ఈజీగా రాదని.. మల్టీపుల్ స్క్రీనింగ్ ఉంటుందన్నారు. ఒకవేళ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినా.. మెయిన్స్ అలా కుదరదన్నారు.
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు:
నేటి నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలకు బోర్డు అన్ని ఏర్పాట్లు చేసినట్టు పూర్తి చేసింది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామని, 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్షల ఏర్పాట్ల సమన్వయానికి జిల్లా ల అధికారులతో కో-ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. నేటి నుంచి ప్రారంభమయ్యేచ ఈ పరీక్షలు వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
మాజీ మంత్రికి కేసీఆర్ నివాళి:
సోమవారం మృతి చెందిన మాజీ మంత్రి.. దివంగత కె. విజయరామారావు నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుమారుడు, కూతురు, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. అధికారికంగా జరుగుతున్న అంత్యక్రియలకు సంబంధించి జరగాల్సిన ఏర్పాట్ల గురించి సీఎం ఆరాతీశారు. కేసీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి, నారదాసు, డిజిపి అంజనీ కుమార్, కమిషనర్ సి.వి.ఆనంద్ తదితరులు ఉన్నారు.
పేపర్ లీకేజీలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర: రేవంత్ రెడ్డి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక పెద్దల హస్తం ఉందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో పలు పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉందని ఎంపీ మండిపడ్డారు. సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఫిర్యాదు లేదని, విచారణ చేస్తే ప్రభుత్వంలోని పెద్దలు దొరుకుతారనే.. పేపర్ లీకేజీపై ప్రభుత్వం ఫిర్యాదు చేయడం లేదని రేవంత్ ఆరోపించారు. పేపర్ లీకేజీపై ఫిర్యాదు అందకున్నా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.
పేపర్లన్నీ లీక్: బండి సంజయ్
కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీక్ అయ్యాయని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షా పత్రం సైతం లీక్ అయ్యిందన్నారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంతోపాటు తానే స్వయంగా పరీక్ష రాశారన్నారు. అత్యధికంగా ప్రవీణ్ కు 103 మార్కులొచ్చాయని, అందుకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ ను బండి సంజయ్ ప్రస్తావించారు. ప్రవీణ్ కోసం పరీక్షా సమయాన్ని సైతం మార్చారని, అభ్యర్థులందరికీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరీక్ష నిర్వహిస్తే… ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి మాత్రం మధ్యాహ్నం తరువాత నిర్వహించారని ఆరోపించారు. దీనిపై ఓ పత్రికలో వార్త వచ్చేంతవరకు టీఎస్పీఎస్సీ స్పందించలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తోపాటు టీఎస్పీఎస్పీ పెద్దల పాత్ర లేనిదే ఇలాంటి ఘటన జరగడం అంత సులువు కాదన్నారు.
మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ
రాష్ట్ర మహిళా కమిషన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. మహిళా కమిషన్ ఎదుట నేడు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న రీత్యా రేపు కమిషన్ ఎదుట హాజరు కావడం సాధ్యం కాదన్నారు. ఈనెల 18న (ఆదివారం) సమయమిస్తే విచారణకు హాజరవుతానన్నారు.
నేటి నుంచే ఒంటిపూట బడులు
తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని.. ఉదయం 8 గంటల నుంచి మ.12.30 గంటల వరకే స్కూళ్లు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యార్థులకు 12.30 గంటల కల్లా మధ్యాహ్న భోజనం పెట్టాలని.. టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగించాలని ఆదేశాల్లో వెల్లడించింది.
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్
రాష్ట్ర చరిత్రలోనే నిన్న ఉదయం 10.03 నిమిషాలకు 15254 మెగా వాట్ల విద్యుత్ అత్యధిక ఫీక్ డిమాండ్ నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగమని ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుందన్నారు. మొత్తం విద్యుత్ వినియోగం లో 37 శాతం వ్యవసాయ రంగానికే అని అన్నారు. ఈ సంవత్సరం వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందని.. ఎంత డిమాండ్ వచ్చిన సరఫరా కు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.
వైఎస్ షర్మిల అరెస్ట్
ఢిల్లీలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఛలో పార్లమెంట్కు షర్మిల పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా షర్మిల తలపెట్టిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా షర్మిల పార్లమెంట్ ముట్టడికి బయలుదేరుతున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.