- 9168పోస్టులకు నోటిఫికేషన్

ఎట్టకేలకు నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 4 నోటిఫికేషన్ను గురువారం రిలీజ్ చేసింది. మొత్తం 25 డిపార్ట్మెంట్లలోని 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈనెల 23 నుంచి జనవరి12 వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో రాతపరీక్ష నిర్వహించనునట్టు తెలిపింది.
2. మల్లారెడ్డిపై ఇక ఈడీ దాడి

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సంస్థలు, కాలేజీలపై ఐటీ రైడ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఆదాయపు పన్ను శాఖ లేఖ రాసింది. మెడికల్ సీట్లు, డొనేషన్ల విషయంలో మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని గుర్తించామని తెలిపింది. దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని ఈడీని కోరింది. మనీలాండరింగ్ కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ జరపాలని సూచించింది.
3. కామారెడ్డికి కిష్టయ్య పేరు

బీఎస్పీ అధికారంలోకి వచ్చాక కామారెడ్డి జిల్లా పేరును కిష్టయ్య జిల్లాగా మారుస్తామని ఆ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షిస్తూ కామారెడ్డి జిల్లాకు చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఆయన వర్దంతి సందర్భంగా ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు. ‘నిఖార్సయిన తెలంగాణ త్యాగమూర్తి కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్. బీఎస్పీ అధికారంలోకి వచ్చాక కామారెడ్డి జిల్లాకు ఆయన పేరు పెడతాం. బరాబర్ పెడతాం”అని ట్వీట్లో పేర్కొన్నారు.
4. కేటీఆర్ భార్యది ఆంధ్రనే కదా?

టీఆర్ఎస్ సర్కారు, ఆ పార్టీ నేతలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. ‘మాట్లాడితే ఆంధ్రావాళ్లని మాట్లాడుతున్నారు.. మరి కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా?’ అని షర్మిల నిలదీశారు. కేటీఆర్ భార్యను గౌరవించినప్పుడు.. తనను ఎందుకు గౌరవించరని ప్రశ్నించారు. తన కాన్వాయ్పై టీఆర్ఎస్ నేతల దాడి, తాను కారులో ఉండగానే పోలీసులు కారును లాక్కెళ్లడం వంటి అంశాలపై గురువారం గవర్నర్కు షర్మిల ఫిర్యాదు చేశారు.
5. బెంగళూర్ డ్రగ్స్ కేసు రీఓపెన్ చేయిస్తాం:

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ దందా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందన్నారు. ఈ కేసులు కర్ణాటక పోలీసులకు డబ్బులు ఇచ్చి కేసు క్లోజ్ చేయించారని, ఈ విషయంలో సదరు ఎమ్మెల్యేలు, కర్ణాటక పోలీసులు, మీడియేటర్లపై చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. త్వరలోనే ఈ కేసు విచారణ ప్రారంభమవుతుందని, తప్పు చేసిన ఎవ్వరినీ వదిలేది లేదని ఆయన హెచ్చరించారు.
6. గంగుల, గాయత్రి రవిని ప్రశ్నించిన సీబీఐ

నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో మంత్రి గంగుల, ఎంపి గాయత్రి రవిని గురువారం ఢిల్లీలో సీబీఐ ఆఫీసర్లు ప్రశ్నించారు. ఇద్దరినీ వేర్వేరుగా, నిందితుడితో కలిపి ముగ్గురిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఈ దిశలో దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు కీలకమైన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది. ఏం మాట్లాడుకున్నారు? డబ్బుల ట్రాన్స్క్షన్లు ఏమైనా జరిగాయా? అనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది.
7. ఎమ్మెల్యేల కేసులో ముగ్గురికి బెయిల్:

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు రామచంద్ర భారతి, నందుకుమార్, సింహయాజిలు వేర్వేరుగా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను గురువారం జస్టిస్ చిల్లకూరు సుమలత విచారణ జరిపారు. సిట్ దర్యాప్తు మొదలై దాదాపు నెల దాటిందని, మెటీరియల్ సీజ్ కూడా చేసిందని, నెల రోజుల కంటే ఎక్కువగా నిందితులు జైలులో ఉన్నారని హైకోర్టు తెలిపింది. ముగ్గురి బెయిల్ పిటిషన్లను అనుమతించింది. ఇరుపక్షాల వాదనల అనంతరం షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది.
8. సింహయాజీతో రాజకీయాలు మాట్లాడలేదు
తిరుపతికి చెందిన స్వామిజీ సింహాయాజీని కేవలం ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే కలిశానని, ఇందులో రాజకీయ కోణమేమి లేదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడైన సింహయాజీని కలిసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన గురువారం క్లారిటీ ఇచ్చారు. ఆర్నెళ్ల క్రితం సింహయాజీని కలిసింది నిజమేనని, తిరుపతి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువంటే కలిశానని వెల్లడించారు.
9. జైల్లో పెట్టినా ఓకె.. లీకులిస్తే ఊరుకోం: కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏజెన్సీలు వచ్చి విచారణ చేస్తామంటే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని.. కానీ మీడియాకు లీకులిచ్చి చెడ్డపేరు తేవాలని ప్రయత్నిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏదైన రాష్ట్రంలోకి మోడీ వచ్చే ముందు ఈడీ రావడం సహజమేనన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. “కాదూ కూడదు… అది చేస్తాం .. ఇది చేస్తాం… జైలులో పెటుతామంటే.. పెట్టుకో.. ఏమైతది? భయపడేదేముంది.. ఏం చేస్తారు? ఉరి ఎక్కిస్తరా ? ఎక్కువలో ఎక్కువ అయితే జైలులో పెడుతారు అంతే కదా.. జైల్లో పెట్టుకోండి. ” అని ఆమె అన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన తప్పులు బయటపడుతున్నాయనే… కవిత, ఆమె కుటుంబం, టీఆర్ఎస్ నేతలు బీజేపీపై ఎదురు దాడి ప్రారంభించారని బీజేపీ నేతలు రివర్స్ ఎటాక్ చేశారు.
10. బాలికపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ రేప్!
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పీఏపై రేప్ కేస్ నమోదైంది. బాలసముద్రం ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఐదేండ్ల లా కోర్స్ చేస్తున్న దళిత బాలికపై మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఆ బాలిక ఉండే హాస్టల్ వార్డెన్(మహిళా) పని ఉందంటూ, బాలికను తన ఇంటికి తీసుకెళ్లిందని, అక్కడే ఆ మహిళ బంధువు విజయ్, ఎమ్మెల్యే నరేందర్ పీఏ శివ అత్యాచారం చేశారని బాలిక బంధువులు హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనకు పాల్పడిన వారిపై ఫోక్సో కేసు నమోదు చేసి ఎంక్వయిరీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
11. ప్రశాంతంగా గుజరాత్ పోలింగ్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో 89 స్థానాలకు గురువారం జరిగిన పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల దాకా 56.88 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 19 జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయని, కొన్ని సెంటర్స్లో ఈవీఎంలు మొరాయించడంతో వెంటనే రీప్లేస్ చేసినట్టు ప్రకటించారు.
12. ఇండియా చేతికి జీ20 బాధ్యతలు

ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను మన దేశం చేపట్టింది. పోయిన నెలలో ఇండోనేషియాలో జరిగిన జీ-20 సదస్సులో అధ్యక్ష బాధ్యతలను ఇండియాకు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం అధికారికంగా జీ20 బాధ్యతలను మన దేశం స్వీకరించింది. వచ్చే ఏడాది నవంబర్ చివరి వరకూ ఇండియా ప్రెసిడెంట్గా వ్యవహరించనుంది. ఈ కాలంలో మొత్తం 200 సమావేశాలకు అధ్యక్షత వహించనుంది.