హైదరాబాద్ అంటే కాస్మోపాలిటన్ సిటీ. విభిన్న కులాలు… మతాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలకు ఇది కేరాఫ్ అడ్రస్. ఎక్కడెక్కడి నుంచే వచ్చిన వారందరూ ఇక్కడ నివాసమేర్పాటు చేసుకున్నారు. అందుకే భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు మన గ్లోబల్ సిటీ.
నిజాం కాలం నుంచే హైదరాబాద్ కు ఎంతో వైవిధ్యముంది. ఒక్కో ఏరియాకు ఒక్కో చరిత్ర ఉంది. ఆ పేరు పెట్టడంలోనూ వారసత్వం ఉంది. ఒక్కో ఏరియాకు ఆ పేరెట్ల వచ్చిందో తెలుసుకుంటే.. హైదరాబాధ్ ఘన కీర్తి మరింత తేటతెల్లమవుతుంది.
వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని సాహుకారి కార్వా అని పిలిచే వారు. ఇప్పుడు లండన్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు.
అల్ బర్ట్ అబిద్ అనే యూదుడు ఆరో నిజాం కాలంలో ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. క్రమంగా ఆ ప్రాంతం ’అబిడ్స్’ గా మారిపోయింది.
నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖా న్అనే దివాన్కు నెఖ్ నామ్ ఖాన్ అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానం చేశాడు. అదే ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడదే నాంపల్లి.
గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం లంగర్ ఖానా ఏర్పాటు చేశారు. అంటే భోజనాల విడిది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు. ఇప్పుడు అదే లంగర్ హౌజ్గా మారింది.
చిచ్లం అనే బంజారా తెగ ఉండే ఏరియా ఇప్పుడు ’చెంచల్ గూడ’ గా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్ర చెపుతోంది.
ట్యాంక్ బండ్ నిర్మాణానికి కూలీలు కావడిలో రాళ్లు మోసినారట. ఆ కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించారు. ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. ఆ ఏరియానే కవాడిగూడగా మారింది.
దోమల గూడ అసలు పేరు దో మల్ గూడ! ఈ ఏరియాలో ఉన్న ఇద్దరు మల్ల యోధులు అప్పట్లో హైదరాబాద్లో ఫేమస్ అట. వారి పేరు మీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమల గూడగా మారింది.
ఖైరతాబాద్.. ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగంకు ఇచ్చిన జాగీరు. అదే ఖైరతాబాద్ గా పిలుస్తున్నారు.
నిజాం సతీమణి హందాబేగం హైదరాబాద్ వ్యాపారులపై దయతో ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అదే బేగంబజారు.
మహ్మద్ ఖులీ కుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన “లాడ్ బజార్ “లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.
అయిదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు కానుకగా ఇచ్చిన భూమి ఇప్పుడు అఫ్జల్ గంజ్ గా స్థిరపడింది. .
ఏడో నిజాం పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ గుర్తుగా హిమాయత్ నగర్ ఏర్పడింది. హైదరాబాద్ మొదటి తాలుఖ్ దార్ (జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరు మీదనే హైదర్ గూడ ఏర్పడింది.
గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే మాలిక్ యాకూబ్ ఇంటి పరిసర ప్రాంతమే మలక్ పేట.
తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె. నాకా అంటే పోలీస్ అవుట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ అవుట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు.
శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. షా అలీ అనే ఒక సూఫీ యోగి ఈ ప్రాంతంలోని పెద్ద బండ పై నివసించే వాడు. ఆయన పేరే ఈ ఏరియాకు పెట్టుకున్నారు.
నిజాం అశ్విక దళంలో అస్బీనియన్స్ నీగ్రో జాతి ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండే ఆ ఏరియాకు హబ్సిగూడ అని పేరొచ్చింది.
చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మరాఠీలో బురద. లోయర్ ట్యాంక్ బండ్ ఏరియా కావడంతో అప్పట్లో ఈ ప్రాంతమంతా మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ఏరియా కావటంతో చిక్కడపల్లి అని పిలిచారు.
అడిక్మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందని చెప్పుకుంటారు.
నిజాం కాలంలో నౌబత్ పహాడ్పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. అందుకే ఈ ఏరియాకు నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది.
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేసే ఏరియాలో పెద్ద ఉద్యాన వనం నిర్మించారు. ట్యాంక్బండ్ నుంచి ఆయన ఈ తోట వరకు నడిచేవాడట. ఈ తోట ఉన్న ఏరియానే బాగ్లింగంపల్లి అని పేరు పెట్టారు.
మీరాలంమండి మార్కెట్. సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మంత్రి మీర్ ఆలం స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. అదే మీరాలం మండి.
నిజాం సైన్యంలో అరేబియన్ పటాలం ఉండేది. చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పటి బార్కాస్.
తాడ్బండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఏరియాకు ఆ పేరొచ్చింది.
ఇర్రంమంజిల్ ప్యాలెస్ చారిత్రక చిహ్నం. ఆరో నిజాం కాలంలో ఈ ప్యాలెస్ని రాయల్ బాంకెట్ హాల్ గా వాడేవారు. అదే ఏరియా ఎర్రం మంజిల్.
కచ్ అనే తెగ నివసించిన ఏరియాకు కాచిగూడ అని పేరు పెట్టారు.
హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ నవాబ్ రెండో నిజాంకు బహుమతి గా ఇచ్చాడు. ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ఆయన పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్గా మారింది.
ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్. ఇప్పుడక్కడే ఎల్బీ స్టేడియం నిర్మించారు. ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఇక్కడ బస చేశాడు. ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు.
పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు: బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు. జనం కోసం నిర్మించింన గుర్తుగా దీన్ని బాగ్-ఏ-ఆమ్ అన్నారు. అదే ఇంగ్లీష్లో పబ్లిక్ గార్డెన్స్ అయింది.
హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్ పేరు మీద “ఆస్మాన్ గఢ్” ఏర్పడింది.
నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద “ఉమ్దా బజార్” ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్ గా ఇది ప్రసిద్ధిగాంచింది.
గౌలీ అంటే గొర్రెల కాపరి. వీళ్లు ఎక్కువగా ఉండే ఏరియాను గౌలిగూడ అని పిలిచారు. అదే పేరు ఇప్పటికీ స్థిరపడిపోయింది.
మౌలాలీ సమీపంలో రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో అదే లాలాగూడగా మారింది.
1933 కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడే చౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చారు. .
రెండో అసఫ్ జాహీ తన కూతురు బషీర్- ఉల్- నిసా బేగంకు కట్నం కింద కొంత జాగీర్ రాసిచ్చాడు. “బేగంపేట” ఏరియా ఆమె పేరుమీదనే స్థిరపడింది.
నవాబ్ నసీరుద్దౌలా హయాంలో పని చేసిన రెవిన్యూ ఉద్యోగి పండిట్ సోనాజీ ఇల్లు రాజప్రాసాదంలా ఉండేది. అది లాండ్ మార్కుగా ఉండటంతో మొదట్లో సోనాజీగూడ అని పిలిచేవారు. తర్వాత సోమాజీగూడ అయింది.
గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరు మీద సైదాబాద్ ఏర్పడింది. మొదట్లో దీన్ని సయ్యదాబాద్ అనేవారు.
టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని ” టప్పాచబుత్ర” అని పిలుస్తున్నారు.
లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు. ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చే వాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే వాడుకునేవారు. అదే క్రమంగా తుకారాంగేట్ గా మారిపోయింది.
హైదరాబాద్ కు చార్మినార్ గుండె అయితే.. పాతబస్తీకి యాఖుత్ పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే అమితమైన ఇష్టం. ఆ ఏరియాకు “యాఖుత్ పురా” అని ఆ నవాబే పేరు పెట్టినట్లు చెపుతారు.
రికాబ్ ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్. మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు. అదే రికాబ్ గంజ్.
రెండో నిజాం హయాంలో ప్రధానిగా పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. అదే సరూర్ నగర్.
డబీర్ అంటే పండితుడు అని అర్ధం. నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.
అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండే ఆ ఏరియా ఎప్పుడు నల్లటి మేఘాలతో ఉండేది. అది అంబర్ పేటగా స్థిరపడిపోయింది.
చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.
సాయంత్రం కాగానే సీతాఫల్ మండి మార్కెట్ మీద చిలుకలు గుంపులు గుంపులుగా వచ్చి వాలి పళ్లు తినేవట. చిలకలు ఎక్కువగా ఉండటంతో చిలకలగూడ అని పేరొచ్చింది.
మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరగటంతో అదే పేరు స్థిరపడింది.