అనుముల రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలకమైన లీడర్. 53 ఏళ్ల చిన్న వయసులోనే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో కీలక పదవిని ఆయన చేజిక్కించుకున్నారు.
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. సాధారణంగా కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ కావాలంటే ఎంతో అనుభవం, వయసూ కావాలి. ఏళ్ల తరబడి పార్టీ సేవల్లో ఉంటే తప్ప ఆ పదవి వరించదు. అలాంటిది పార్టీలో చేరిన మూడున్నర ఏళ్లకే పీసీసీ ఛీఫ్ పదవి సాధించారు.
ఇంతకీ రేవంత్ ప్రస్థానం ఏమిటీ? ఎక్కడ మొదలయ్యారు? ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఆ వివరాలు తెలుసుకుందాం..
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8వ తేదీన జన్మించారు. ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా పాత మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి ఆయన పుట్టిన ఊరు. ఆయన తండ్రి పేరు అనుముల నర్సింహారెడ్డి, తల్లి పేరు రామచంద్రమ్మ. ఏడుగురు అన్మదమ్ములు, ఒక సోదరితో కూడిన పెద్ద కుటుంబంలో రేవంత్ ఒకరు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రేవంత్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.
అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న రేవంత్ రెడ్డి డిగ్రీ కోసం హైదరాబాద్కు వచ్చారు. ఏవీ కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లో ఆయన విద్యార్థి సంఘ రాజకీయాల పట్ల ఆకర్శితులయ్యారు.
ఇంటర్లోనే ప్రేమలో పడ్డ రేవంత్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి కూడా ఆ ప్రేమే కారణం అని తెలుస్తున్నది. స్వర్గీయ జైపాల్ రెడ్డి సోదరుని కుమార్తె గీతతో ఆయన లవ్లో పడ్డారు. అంతస్థుల తేడా రావడంతో అందరి స్టోరీల తీరులోనే రేవంత్ కూడా లవ్ని సక్సెస్ని చేసుకోవడం కోసం కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన రకరకాల సాహసాలు చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతారు.
మొత్తం మీద ఒక రాజకీయ పలుకుబడి కలిగిన కుటుంబంలోని అమ్మాయిని ప్రేమించిన రేవంత్ అదే రంగంలో పైకి రావాలనుకున్నారు. డిగ్రీ తర్వాత ఊరికి వెళ్లిన రేవంత్ అక్కడో ప్రింటింగ్ ప్రెస్ నడిపారు. అంతకుముందు సామాన్య కార్యకర్తగా ఏబీవీపీ లో రేవంత్ వాల్ రైటింగ్ కూడా చేసినట్లు ఫ్రెండ్స్ చెప్పుకుంటారు. ఆర్ఎస్ఎస్ పత్రిక పనులు చూసే క్రమంలో ఆయన ప్రింటింగ్ అనుభవం వచ్చింది. దాంతో తొలుత అదే బిజినెస్లోకి దిగిన ఆయన తర్వాత రియల్ ఎస్టేట్ వైపు మళ్లారు. రేవంత్ రెడ్డి ఆర్థిక ఎదుగుదలకు ఆ రంగమే కారణమని ఆయన సన్నిహితులు చెబుతారు. ఇప్పటికీ అదే ఆయన ప్రధాన వ్యాపారం.
2004లో టీఆర్ఎస్లో చేరిన రేవంత్ కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల పొత్తు కారణంగా రేవంత్ ఆశలు ఫలించలేదు. పార్టీని నమ్ముకుంటే లాభం లేదనుకున్న రేవంత్ 2006లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీగా గెలిచారు. ప్రజాప్రతినిధిగా ఇది ఆయనకు తొలి అడుగు.
అంతటితో ఆగకుండా రేవంత్ 2007లో మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొంది చట్టసభల్లో అడుగు పెట్టారు. 2008లో టీడీపీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొండగల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఇది ఆయనకు తొలి విజయం. 2014లో కూడా ఆయన అదే నియోజక వర్గం నుంచి మరోమారు గెలుపొందారు. అట్లా ఆయన తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొంటూ జనంలో ఆదరణ పొందారు. అప్పుడే రాష్ట్ర స్థాయి నేతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
2015 మేలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో చిక్కారు. టీఆర్ఎస్కి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్కు డబ్బు ఆశ చూపి ఆయన ఓటును కొనుగోలు చేయాలనే ప్రయత్నించారనే ఆరోపణలతో రేవంత్ అరెస్ట్ అయ్యి కొద్ది రోజులు జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి రేవంత్ జీవితంలో కొత్త కోణం మొదలయ్యింది. స్టీవెన్సన్తో మాట్లాడిన ఆడియో టేపుల లీకేజీ, బెయిల్ లేకుండా జైల్లో వేయడం రేవంత్ ఊహించని పరిణామం. దానికి తోడు తన ఏకైక కూతురు నిశ్చితార్ధం ఉన్న సమయంలో జైలుకి పంపడంతో మనోవేదనకు గురైన రేవంత్ రిలీజ్ అయిన రోజు కేసీఆర్కు వ్యతిరేకంగా తొడ గొట్టి మీసం మేలేసి ఆయనను గద్దె దింపుతానని శపథం చేశారు.
టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్శ్లో భాగంగా అప్పటికి టీటీడీపీలో ఉన్న చాలా మంది గట్టి నాయకులు కారెక్కడంతో తెలంగాణలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యింది.
ఓటు కు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఆశలు వదులుకున్నారు. ఆయన కూడా హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చారు. ఇంకా టీడీపీలో కొనసాగడం వృధా అని, తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన రేవంత్ 2017 అక్టోబర్ 25న రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్లో చేరారు. చేరిన కొద్ది రోజులకే టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అదే హోదాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయంగా ఇది ఆయనకు తొలి ఓటమి.
ఆ వెంటనే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అతి పెద్ద నియోజక వర్గమైన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఆ ఊపులో మరింత దూకుడు పెంచిన రేవంత్ 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్షుడుగా అనౌన్స్ అయ్యారు. జులై 7న ఛార్జ్ తీసుకున్న ఆయన ప్రస్తుతం పార్టీని 2023 ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో తలమునకలై ఉన్నారు.