కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అరుంధతి .. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శ్యామ్ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 2009లో సంక్రాంతి కానుకగా జనవరి 16న విడుదలైన అరుంధతి సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ తో అనుష్క ఏకంగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో అనుష్క తరువాత అంత మంచి పేరు సంపాదించుకుంది ఎవరైనా ఉన్నారంటే అది సోనూసూద్ నే.
వాస్తవానికి పశుపతి పాత్రకు ముందుగా అనుకున్నది సోనూసూద్ ను కాదు. ఈ పాత్రకు మొదట తమిళ నటుడు పశుపతిని అనుకున్నారు. ఆ పేరు పెట్టడానికి కూడా కారణం అదే. అఘోర పాత్రకు పశుపతి చక్కగా సూట్ అవుతారని చిత్రం బృందం భావించింది. కానీ ఆ తరువాత సినిమాలో కొన్ని సీన్లలో పశుపతి పాత్ర రాయల్ లుక్లో కనిపించాలి. దీంతో ఆలోచనలో పడ్డారు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ చిత్రం విడుదలైంది. అందులో విలన్గా నటించిన సోనూసూద్.. నిర్మాత శ్యామ్ ప్రసాద్రెడ్డి దృష్టిని ఆకర్షించారు. ఆయనను పిలిపించి అఘోర పాత్ర గెటప్ వేసి టెస్ట్ చేశారు. ముందుగా ఆ పాత్ర చేయడానికి తనకు ఇష్టం లేకపోయినా శ్యామ్ ప్రసాద్రెడ్డి తపన చూసి చివరకు సోనూసూద్ అంగీకరించారు.
పశుపతి పాత్రకు సంబంధించి 20 రోజుల్లో ఆయన వర్క్ పూర్తి చేస్తామని శ్యామ్ ప్రసాద్రెడ్డి చెప్పగానే, రూ.18 లక్షలు రెమ్యూనరేషన్ ఇవ్వమని సోనూసూద్ డిమాండ్ చేశారు. ఆయన మరో ఆప్షన్ కూడా ఇచ్చారు. రూ. 20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా పని చేస్తానని చెప్పారు. కానీ, శ్యామ్ ప్రసాద్రెడ్డి ఒప్పుకోలేదు. 20 రోజుల్లోనే అతని వర్క్ పూర్తి చేస్తాననీ, రూ.18 లక్షలే ఇస్తానని చెప్పారు.
ఒక వేళ 20 రోజుల్లో వర్క్ పూర్తి కాకపోతే, ఆ తర్వాత ఎన్ని రోజులు ఎక్కువ వర్క్ చేస్తే రోజుకి రూ. 25 వేలు ఇస్తానని శ్యామ్ ప్రసాద్రెడ్డి చెప్పారు. అనుకున్నట్లుగా 20 రోజుల్లో సోనూసూద్ వర్క్ పూర్తి కాలేదు. చివరకు ‘అరుంధతి’ చిత్రం ద్వారా సోనూ సూద్ లభించిన రెమ్యూనరేషన్ అక్షరాలా రూ.45 లక్షలు.