అన్ని ఏళ్లుంటేనే 1వ తరగతి.. తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. అధికారమిస్తే వడ్డీ లేని రుణాలు: రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలకు షర్మిల పరామర్శ.. హాస్టల్ విద్యార్థులపై కుక్కల దాడి.. డిగ్రీ సిలబస్ లో మార్పులు.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

ఆరేళ్లుంటేనే 1వ తరగతి:

నూతన విద్యావిధానంలో భాగంగా ఇకపై ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందాలంటే చిన్నారులకు తప్పనిసరిగా ఆరేళ్లు నిండి ఉండాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది.

మరో రూ.500 కోట్ల పెట్టుబడి

రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో వెల్‌స్పన్ ఇండియా లిమిటెడ్ అధునాతన టెక్స్‌టైల్ యూనిట్‌ను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.. రూ.500 కోట్ల పెట్టుబడితో టెక్స్‌టైల్ యూనిట్ ఏర్పాటు చేసిన వెల్స్పన్ గ్రూప్, 2 సంవత్సరాల క్రితం రూ.1500 కోట్ల విలువైన ఫ్లోరింగ్ యూనిట్‌ని ఇదే పరిసరాల్లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య, ఎమ్మెల్సీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతోన్న బ్రహ్మోత్సవాలు:

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు వేదమంత్రోత్సవాల మధ్య ఆలయ అర్చకులు అగ్ని ప్రతిష్ట మరియు ధ్వజారోహణం అత్యంత కనుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మరియు టెంపుల్ ఈవో గీతారెడ్డి ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు.

అధికారమిస్తే వడ్డీ లేని రుణాలు:

కాంగ్రెస్‌కు అధికారమిస్తే మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా నిలబడేలా చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనన్నారు. రేవంత్‌ రెడ్డి చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర భూపాలపల్లి జిల్లాలో బుధవారం సాగింది. రాత్రి మొగుళ్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

ఒడిశాకు బస్ సర్వీసులు

ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్‌ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఓఎస్ఆర్టీసీ)తో టీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గారి సమక్షంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్‌ గారు, ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌ కుమార్‌ పట్నాయక్‌, ఐపీఎస్‌ గారు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాటిని పరస్పరం అందజేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. టీఎస్‌ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు.. ఓఎస్‌ఆర్టీసీ 13 సర్వీస్‌లను తెలంగాణకు నడపనుంది.

కాంగ్రెస్ నేతకు షర్మిల పరామర్శ

బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన యూత్ కాంగ్రెస్ వరంగల్ అధ్యక్షుడు పవన్ ను వైఎస్సార్ టీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు వైఎస్ షర్మిల పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి పవన్ అరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ బ్రతికి లేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్టల్ విద్యార్థులపై కుక్కల దాడి

తెలంగాణలో వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతోంది. శంకరపట్నం మండలంలో కుక్కల స్వైర విహారం చేశాయి. స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం లో సుమంత్ అనే విద్యార్థి పై వీధి కుక్కులు దాడి చేశాయి. దీంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

డిగ్రీ సిలబస్ లో మార్పులు

నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలో వాణిజ్యశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం విభాగాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య ప్రణాళిక అమల్లోకి రానుందని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ బేగంపేట్ లోని సెస్ లో “అత్యుత్తమ పాఠ్యప్రణాళిక అభివృద్ధి” కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు లేఖ రాశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ లేఖ రాశారు. ఇప్పటి వరకూ తనకు ఏ ఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో.. ఆ లిస్ట్ ను డీజీపీకి రాసిన లేఖలో వివరించారు.

హైదరాబాద్ కు బీజేపీ జాతీయ నేతలు

బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర ఇన్ చార్జీలు సునిల్ బన్సల్, తరుణ్ చుగ్, సహ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ తదితరులు గురువారం హైదరాబాద్ కు రానున్నారు. బూత్ స్వశక్తికరణ్ అభియాన్ వర్క్ షాప్ పై చర్చలు నిర్వహించనున్నారు. రాష్ట్ర పదాదికారులు, జిల్లా అధ్యక్షలతో వారు చర్చలు జరపనున్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here