ఆ రాష్ట్రంపై కేసీఆర్ ఫోకస్, రంగంలోకి కవిత.. 6 సార్లు ఆగిన ప్రీతి గుండె.. ఆపరేషన్ జరిగిన ఐదేళ్లకు కడుపులో కత్తెర.. ఆ 4 టీఎస్పీఎస్సీ పరీక్షల తేదీల ప్రకటన.. నేడు హైదరాబాద్ లో ఇళయరాజా మ్యూజికల్ ఈవెంట్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

మహారాష్ట్రలో ఎమ్మెల్సీ కవిత పర్యటన

మహారాష్ట్ర అభివృద్ధిలో తమ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని, ఇక్కడి ప్రజల కోసం తాము పని చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముంబయిలో , మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహారాష్ట్ర సాంస్కృతిక సంగీతం, డోలు చప్పుడు తో కార్యక్రమ వేదిక మార్మోగింది. తెలంగాణ జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ముఖ్యంగా పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ చర్చ నడుస్తుందని తెలిపారు. తెలంగాణతో దాదాపు 1000 కిలోమీటర్ల మేర మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటుందని, తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.

రేపటి నుంచి రేవంత్ యాత్ర

హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన మార్పు కోసం యాత్ర రేపటి నుంచి పున: ప్రారంభం కానుంది. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీకి వెళ్లడంతో రేవంత్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్లీనరీ ముగియడంతో రేపు.. అంటే ఫిబ్రవరి 27 నుంచి ఆయన యాత్రం తిరిగి ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 4 గంటలకు పరకాల నియోజకవర్గంలోని పులిగిల్ల నుచి రేవంత్ యాత్రను ప్రారంభించనున్నారు.

రాష్ట్రపతి పాలన విధించాలన్న షర్మిల

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల గవర్నర్ తమిళిసైని కోరారు. శనివారం గవర్నర్ ను రాజ్ భవన్ లో కలిసిన షర్మిల ఈ మేరకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాజ్యంగం ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛకు విలువ లేదన్నారు.

ఆరు సార్లు ఆగిన ప్రీతి గుండె:

ఆత్మహత్యకు యత్నించిన వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వెంటీలేటర్, ఎక్మో యంత్రం సహాయంతో ఆమెకు నిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎంజీఎంలో ఆమె గుండె ఒక సారి ఆగిపోగా.. నిమ్స్ లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు గుండె ఆగిపోయింది. సీపీఆర్ చేసి గుండె పని చేసేలా చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.

కాలేజీ నుంచి సైఫ్ సస్పెండ్

కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతిని వేధించి.. ఆమె ఆత్మహత్యకు కారాణమైన సైఫ్ ను అధికారులు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటికే సైఫ్ ను వరంగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ వివరాలు వెల్లడించారు.

ఐదేళ్ల తర్వత వెలుగులోకి కడుపులో కత్తెర

ఆపరేషన్ చేసిన ఓ వైద్యురాలు కడుపులో కత్తెర మరిచిపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గోదావరిఖని లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ ఓ మహిళ కూ ఐదేళ్ల క్రితం వైద్యురాలు డెలివరీ చేసింది. తాజాగా తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో బాధితురాలు హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించుకుంది. దీంతో ఎక్స్ రే తీయగా.. కడుపులో కత్తెర ఉన్నట్లు గా రిపోర్ట్ వచ్చింది. దీంతో బాధిత మహిళ బంధువులు గోదావరిఖని వచ్చి వైద్యురాలిని నిలదీశారు. మరోసారి ఆపరేషన్ కు అయ్యే ఖర్చులు భరిస్తానని డాక్టర్ చెప్పినట్లు సమాచారం.

మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్మయత్నం ఘటన మరువక ముందే.. తాజాగా నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష (22) తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాసరి హర్ష ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా బయటకు రాలేదు.

పలు పరీక్షల తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ

వివిధ ఇంజనీరింగ్‌ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజనీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 5వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మార్చి 5వ తేదీన ఉదయం 10గంటల నుంచి 12.30 గంటల దాకా, మళ్లీ మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పరీక్ష ఉంటుందని గుర్తు చేసింది. అభ్యర్థులు 27వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని గుర్తుచేసింది.

ముగిసిన బయో ఏషియా-2023 సదస్సు

ఆర్థికాభివృద్ధిలో ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ అనే మూడు అంశాలే బలమైన చోదకాలుగా తాను విశ్వసిస్తానని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ మూడు ‘ఐ’లే సమయం వచ్చినప్పుడు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రతిభావంతమైన దేశంగా నిలుపుతాయని పేర్కొన్నారు. శనివారం హెచ్‌ఐసీసీలో బయో ఏషియా-2023 ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. బయో ఏషియా ఆసియా ఖండంలోనే అతి పెద్ద లైఫ్‌ సైన్సెస్‌ కార్యక్రమమని, ప్రస్తుతం నిర్వహిస్తున్న 20వ విడత సదస్సుకు అపూర్వ స్పందన లభించిందని చెప్పారు. సదస్సుకు 50 దేశాల నుంచి 2000లకు పైగా ప్రతినిధులు హాజరు కాగా, 200లకు పైగా బీ2బీ సమావేశాలు జరిగాయని వెల్లడించారు. రెండు రోజులపాటు జరిగిన చర్చల్లో పలు కీలక అంశాలపై వివిధ దేశాల నుంచి వచ్చిన నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ ఎకో సిస్టం గురించి బయో ఏషియా సదస్సు ద్వారా ప్రపంచానికి మరోసారి తెలిసిందని అన్నారు.

నేడు హైదరాబాద్ లో ఇళయరాజా మ్యూజికల్ ఈవెంట్

సంగీత దిగ్గజం, మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజికల్ లైవ్ ఈవెంట్‌కు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఇవాళ (ఫిబ్రవరి 26) గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ లైవ్‌ కన్సర్ట్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. హైదరాబాద్ టాకీస్ వ్యవస్థాపకులు మల్కాపురం సాయినాథ్ గౌడ్ ఈ వేడుకను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తదితరులు ఈ మ్యూజికల్ లైవ్ ఈవెంట్‌కు ప్రధాన అతిథులుగా హాజరకానున్నారు. కాగా ఈ లైవ్‌ కన్సర్ట్‌ కోసం ఐదేళ్ల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టారు ఇళయరాజా. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించేందుకు సినీ తారలు, రాజకీయ వేత్తలను కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆహ్వానించారు. గచ్చిబౌళి స్టేడియంలో సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ లైవ్ కన్సర్ట్‌ను చూసేందుకు దాదాపు 20,000 మందికి పైగా హాజరవుతారని నిర్వాహకులు భావిస్తున్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here