SPECIAL STORY: ఆ ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నో టికెట్..
టీఆర్ఎస్, కమ్యూనిస్టుల పొత్తు దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ టికెట్లను త్యాగం చేయక తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వారి స్థానాల్లో పొత్తుల్లో భాగంగా సీపీఎం, సీపీఐ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలుస్తోంది. వారు ఎవరు? ఆ స్థానాలు ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి పూర్తి స్టోరీ చదవండి.
ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి
నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడికి దిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న అరవింద్ ఇంటిపై ఆ పార్టీ కార్యకర్తలు కొందరు ఈ దాడి చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శుక్రవారం ఉదయమే టీఆర్ఎస్ నాయకులు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేశారు. టీఆర్ఎస్ నాయకుడు రాజారాం యాదవ్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎంపీ ఇంటి ఎదుట కొంతసేపు ఆందోళనకు దిగారు. పోలీసులు చూస్తుండగానే ఎంపీ ఇంట్లోకి దూసుకెళ్లిన టీఆర్ఎస్ నాయకులు ఫర్నీచర్, కిటికీ అద్దాలు, దేవుడి పటాలు ధ్వంసం చేశారు. కార్లతో పాటు ఇంట్లో ఉన్న పలు వస్తువులపైనా దాడి చేశారు. తమ ఇంటిపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించారని అర్వింద్ తల్లి విజయలక్ష్మీ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చెప్పుతో కొడుతం.. సంపుతం
నిజామాబాద్ ఎంపీ అరవింద్ తనపై చేసిన కామెంట్లపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఏకంగా నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుత.. తరిమి తరిమి కొడుతుం సంపుతం.. అని హెచ్చరించారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడగొడుతామని కవిత శపథం చేశారు. తమ పార్టీలో చేరాలని.. ఇక్కడ షిండేలను తయారు చేయాలని బీజేపీ తనతో మాట్లాడింది నిజమేనని కవిత అంగీకరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తనకు ఎలాంటి సమన్లు అందలేదని చెప్పారు. టీఆర్ఎస్ భవన్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఇందూరులోనే పోటీ చేస్తా.. అక్కడే తేల్చుకుందాం..
ఎమ్మెల్సీ కవితపై నేనేమీ తప్పుడు భాష మాట్లాడలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ తన ఇంటిపై దాడి జరిగిన ఘటనపై రియాక్టయ్యారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు ఆమె ఫోన్ చేస్తే…చేశానని చెప్పాలని, లేదంటే ఖండించాలని..ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు. తన ఇంటిపై దాడి ఘటనతో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్న అరవింద: దాడి జరిగిన తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కవిత రాజకీయ జీవితం ముగిసిందని ఎక్కడ నిలబడ్డా.. గెలిచే పరిస్థితి లేదని అన్నారు. మరోసారి తాను ఇందూరు నుంచే పోటీ చేస్తానని.. అక్కడ గెలవాలని కవితకు సవాల్ విసిరారు. బీజేపీ నుంచి వందల కోట్ల ఆఫర్ ఎవరు ఇచ్చారో జవాబివ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ది తప్పు కాదని.. పోలీసులు గులాబీ కండువాలకు అమ్మడు పోయారని.. నేను ఇంత వరకు ఇంత యూజ్లెస్ పోలీస్ బాస్ను చూడలేదని డీజీపీ మహేందర్రెడ్డిపై మండిపడ్డారు. అమిత్షాతో పాటు బీజేపీ ముఖ్య నేతలందరూ అరవింద్ ఇంటిపై దాడిని ఖండించారు. అమిత్షా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు.
కవితను విచారించండి: రేవంత్ రెడ్డి
పార్టీ మారాలని ప్రలోభ పెట్టారని చెబుతున్న కేసులో ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించాలని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆమెపై వెంటనే కేసు కూడా నమోదు చేయాలన్నారు. ఆమె తనను బీజేపీలోకి రావాలని అడిగినట్లు స్వయంగా చెప్పిన మాటలను ఈ కేసు విచారణ కోసం నియమించిన సిట్ అధికారి సీవీ ఆనంద్ సూమోటోగా తీసుకోవాలన్నారు. తనను ఎవరు పార్టీలోకి ఆహ్వానించారో తేల్చాల్సిన అవసరం సిట్పై ఉందన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కవిత ప్రెస్ మీట్ పై స్పందించారు. సిట్ ఆ పనిచేయకుంటే పోలీసులు దోషులుగా నిలబడాల్సి ఉంటుందని అన్నారు. పశువుల కంటే హీనంగా రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కొనుగోలు జరుగుతోందని ఆయన అన్నారు.
బీజేపీలోకి మర్రి శశిధర్రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. పార్టీలో చేరికకు సంబంధించి చర్చలు జరిపారు. రెండు మూడు రోజుల్లో ఆయన పార్టీలో చేరనున్నట్లు రాష్ట్ర పార్టీ నేతలు తెలిపారు. గతంలో మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన అక్కడే టికెట్ ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి పోటీ చేసే ఆలోచనతోనే మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల కేసు: బీజేపీ జాతీయ కార్యదర్శికి సిట్ నోటీస్
ఎమ్మెల్యేల ఫామ్హౌజ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీలోని 41ఎ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న ఉదయం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ ఆఫీసులో దర్యాప్తునకు హాజరు కావాలని, విచారణకు రాకపోతే అరెస్టు చేస్తామని నోటీసులో ప్రస్తావించింది. దర్యాప్తునకు సహకరించాలని, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని, మొబైల్, ల్యాప్టాప్, ఇతర డివైజ్లను దర్యాప్తునకు తీసుకురావాలని, వాటిలోని డేటాను డిలీట్ లేదా ధ్వంసం చేయకూడదని 41ఎ నోటీసులో పేర్కొంది.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిద్దాం..
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేవరు విశ్రమించవద్దని అంతర్జాతీయ సమాజానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను ఎదుర్కోడంపై శుక్రవారం జరిగిన ‘నో మనీ ఫర్ టెర్రర్’ మూడో మినిస్టీరియల్ కార్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్, చైనాపై ప్రధాని ఈ సందర్భంగా పరోక్షంగా ధ్వజమెత్తారు.
నింగిలోకి ప్రైవేటు రాకెట్
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేట్ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని షార్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్-ఎస్ ప్రయోగాన్ని చేపట్టారు. 80 కి.మీ లక్ష్యం నిర్ధేశించగా.. 89.5 కి.మీ గరిష్ట ఎత్తుకు చేసింది. ప్రయోగించిన 5 నిమిషాల అనంతరం బంగాళాఖాతంలో పడిపోయింది. విక్రమ్-ఎస్ విజయవంతం తర్వాత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ తదితరులు రాకెట్ ను రూపొందించిన స్కైరూట్ సంస్థను ట్విట్టర్ ద్వారా అభినందించారు.
టీ 20 టీమ్ ఇండియా ఓటమిపై యాక్షన్
టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఓటమిపై బీసీసీఐ చర్యలు మొదలు పెట్టింది. జట్టులో కీలక మార్పులు ఉంటాయని అంతా భావించినప్పటికీ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అనూహ్య నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సహా సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. వెంటనే కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.